Telangana Rythu Bharosa Status 2026 : తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా (Rythu Bharosa) పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 22, ఆదివారం నాడు ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో, నేటి (సోమవారం) నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయించిన భారీ నిధులతో సాగు సాయం పంపిణీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నేటి నుంచే నగదు జమ.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి!
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ యాసంగి-2026 సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం అందుతుంది. ప్రభుత్వం ఇప్పటికే నిధులను బ్యాంకులకు బదిలీ చేయగా, నేటి నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో ఈ మొత్తం పడనుంది. సాగు భూమి విస్తీర్ణాన్ని బట్టి ఈ నగదు బదిలీ జరుగుతుంది.
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి గోల్డెన్ ఛాన్స్
కేవలం నిధుల విడుదల మాత్రమే కాకుండా, ప్రభుత్వం రైతులకు మరో తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధి పొందని వారు లేదా కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
గడువు : ఫిబ్రవరి 28, 2026 వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారు అర్హులు.
ఎవరు దరఖాస్తు చేయాలి? : పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఇప్పటి వరకు రైతు భరోసా పొందని వారు, అలాగే గతంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వారు వెంటనే అప్లై చేసుకోవచ్చు.
బ్యాంక్ అకౌంట్ అప్డేట్ : గతంలో లబ్ధి పొందుతున్న వారు తమ బ్యాంక్ వివరాలు మార్చుకోవాలనుకున్నా లేదా అప్డేట్ చేయాలనుకున్నా ఇప్పుడు అవకాశం ఉంది.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే : కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు ఈ క్రింది డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండాలి:
రైతు భరోసా దరఖాస్తు ఫారం :
పట్టాదార్ పాసుపుస్తకం (లేదా తహసీల్దారు డిజిటల్ సంతకం ఉన్న పత్రం).
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు.
బ్యాంకు పాసుపుస్తకం మొదటి పేజీ జిరాక్స్.
నామినీ వివరాలు : భార్య/భర్త/కుమారుడి ఆధార్ జిరాక్స్ మరియు మొబైల్ నెంబరు.
ఎక్కడ దరఖాస్తు చేయాలి ? చివరి తేదీ ఎప్పుడు ?
రైతులు తమ సమీపంలోని రైతు వేదిక వద్ద సంబంధిత ఏఈవో (AEO) ను సంప్రదించి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ భూ విస్తీర్ణం వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేయించుకోవడం మర్చిపోవద్దు.
ముఖ్య గమనిక : దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 25, 2026.

