Indiramma Indlu Phase 2 : సొంత గూడు లేని నిరుపేదల కల సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu Phase 2) మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఏప్రిల్ మరియు మే నెలల్లో ఈ రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
దశల వారీగా ఇళ్ల నిర్మాణం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అత్యంత కీలకమైనది. ఇప్పటికే మొదటి విడత కింద ఇళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం, మిగిలిన మూడు విడతల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మారుమూల గిరిజన తండాలు, గూడాల నుంచి ఈ పంపిణీని మొదలుపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ వర్తింపజేయనున్నారు.
జూన్ నాటికి 99 శాతం పూర్తి
మొదటి విడతలో మంజూరైన ఇళ్లకు సంబంధించి మంత్రి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్-జూలై నాటికి తొలి విడత ఇళ్లలో దాదాపు 99 శాతం నిర్మాణాలు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
99 రోజుల స్పెషల్ డ్రైవ్
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీని కోసం “99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని” అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, నిరుపేదలకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పారదర్శక విధానంతో పేదల సొంతింటి కల త్వరలోనే నెరవేరనుంది.

